హైదరాబాద్ నగరంలో చిరుత కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన సుభానీ అనే లారీ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దానికి ఏమైందోనని దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించాడు. దాంతో అది అతనిపై దాడి చేసి పారిపోయింది. చిరుత దాడిలో గాయపడ్డ లారీ డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. రోడ్డు మీద చిరుత ఉందన్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులు అది ఉన్న ప్రాంతానికి వచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తు మందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో చిరుతను ఎలాగైనా పట్టుకొని తీరుతామని అధికారులు పేర్కొన్నారు.