కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి : కేటీఆర్

Update: 2020-10-29 06:56 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను, ఉపాధి అవకాశాలను కేంద్రం దెబ్బతీసిందని విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో బీజేపీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగి మూడేళ్లైనా 3 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నలుగురు బీజేపీ ఎంపీలు వారి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్క పైసా అయినా అదనంగా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.

దేశంలో అత్యధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్​. ఇప్పటివరకు రైతులకు 27 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించిందన్నారు. జీఎస్​డీపీలో వ్యవసాయం పాత్ర 300 రెట్లు పెరిగి.. తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని వివరించారు. రుణమాఫి, రైతుబంధు పథకంలో సింహభాగం చిన్న, సన్నకారు రైతులకే చేరడం సంతృప్తినిచ్చిందన్నారు. మొత్తం రైతులకు 56 వేల కోట్ల సహాయం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

దుబ్బాకలో గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో తప్ప సొసైటీలో లేదని అలాగే కాంగ్రెస్ గల్లీ నుంచి దిల్లీ వరకు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News