ఆర్టీసీ ఉద్యోగులు తమ హక్కులను సాధించడం కోసం 55 రోజుల పాటుగా సమ్మెను నిర్వహించారన్న విషయం అందరికీ విదితమే. ఈ సమ్మె కాలంలో చాలా మంది కార్మికులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. దీంతో ఆ బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా ఆలోచనలను తలపెట్టింది. మరణించిన కార్మిక కుటుంబాలలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తానని హామీ ఇచ్చింది.
ఈ నెల ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈ హామీని ఇచ్చింది. అంతే కాక మహిళా కార్మికులకు కూడా పెద్ద ఎత్తున వరాలు ఇచ్చింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా టీఎస్ఆర్టీసీ అధికారులు కార్యాచరణను మొదలు పెట్టారు. ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో మృతి చెందిన 33 మంది ఉద్యోగుల పిల్లలకు వారి వారి విద్యార్హతలను బట్టి ఆర్టీసీలో కొలువులు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
అంతే కాకుండా మృతి చెందిన 38 మంది ఉద్యోగులకు సంబంధించిన 22 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు. ఈ నష్టపరిహారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు అందించారు. మిగిలిన16 కుటుంబాలకు చెందిన వారికి ఈ శనివారం నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఇప్పటి దాకా రాత్రి 10 గంటల వరకూ పనిచేసే మహిళల పనివేళలను కుదించారు. వారు రాత్రి 8 గంటల్లోపే ఇంటికి వెళ్లే విధంగా షెడ్యూలు సర్దుబాటు చేయాలని సునీల్శర్మ డిపో మేనేజర్లను ఆదేశించారు.
మహిళా ఉద్యోగుల సౌకర్యార్ధం ఈ నెల 15 లోపు హైదరాబాద్ నగరంలో విశ్రాంతి గదులతో పాటు, డిపోలు, హైదరాబాద్ సిటీ చేంజ్ఓవర్ పాయింట్ల వద్ద మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని చీఫ్ సివిల్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు.