హైదరాబాద్ ప్రజలకు ఊరట

Update: 2020-10-15 05:49 GMT

హైదరాబాద్ గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా అతలాకుతలమయింది. అయితే నగరంలో ఇంతటి భయానక పరిస్థితుల్ని సృష్టించిన వాయుగుండం హైదరాబాద్‌ను దాటింది. సుమారు 30 ఏండ్ల తరువాత సరిగ్గా భాగ్యనగరం మీదుగా ప్రయాణించిన వాయుగుండం చివరికి కర్ణాటకకు చేరుకుంది. దీంతో నగరవాసులకు పెద్ద గండం తప్పినట్టైంది. అయితే వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో గ్రేటర్‌లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు.

వాయుగుండం కర్నాటకను తాకినప్పటికీ వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం రాత్రి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

నగరంలో మంగళవారం నుంచి కురిసిన భారీ వర్షాలకు మహానగరం పూర్తిగా జలమయం అయింది. ఇప్పటికే నగరంలో కురిసిన భారీ వర్షాలకు 24 మంది మరణించారు. వరదలో చిక్కుకున్న పలువురిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది వానల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం జూన్‌లోనే అంచనా వేసింది.

Tags:    

Similar News