Weather Report: సుర్రుమనిపిస్తున్న సూరీడు
Weather Report: 3 రోజుల పాటు 12 జిల్లాలకు రెడ్అలర్ట్
Weather Report: తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. రాత్రి తొమ్మిదైనా వేడి తగ్గడం లేదు. నిత్యం సాధారణం కంటే ఏడెనిమిది డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి.
తెలంగాణలోని 11 జిల్లాల్లో నిన్న 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులకుగానూ 12 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 46 డిగ్రీలకుపైగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పుందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. అలాగే, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ఉమ్మడి జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని అన్ని మండలాలూ రెడ్జోన్లోకి వెళ్లిపోయాయి. అక్కడ ఇప్పటికే 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్అవుతున్నాయి. నిన్న నల్గొండ జిల్లా గుడాపూర్లో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్నమోదైంది. మంగపేట, మునగాల, చండూరు, భద్రాచలంలో 46.5 డిగ్రీలు, తిమ్మాపూర్, వైరా, ఖానాపూర్, వెల్గటూర్, ముత్తారంలో 46.4 డిగ్రీలు, కొమ్ములవంచలో 46.3... కల్లెడ, వీణవంక, జన్నారంలో 46.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా, 7 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా, 6 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్అయ్యాయి.
ఈ నెలలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ స్పెషల్ బులెటిన్లో వెల్లడించింది. అయితే, వడగాలుల వీచే రోజుల సంఖ్య మాత్రం తగ్గుతుందని తెలిపింది. రాష్ట్రంలో మే నెల మొత్తంగా సగటున నాలుగు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ఇటు వానలు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 1970 నుంచి 2020 వరకు మేలో నమోదైన సగటు వర్షపాతం ఆధారంగా.. ఈ నెలలోనూ సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.