వరంగల్లో అరుదైన 'ప్లాస్టిక్ సర్జరీ' : ప్రాణాపాయం నుంచి బయటపడ్డ యువకుడు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఓ వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్సను అందించి ప్రాణాపాయం నుంచి కాపాడిన సంఘటన వరంగల్ ములుగు రోడ్డులోని గార్డియన్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ పీ కాళీప్రసాదరావు తెలిపిన వివరాల్లోకెళితే బీ రామచందర్ అనే యువకుడు పరకాల మండలం నార్లాపూర్ గ్రామంలో నివాసం ఉండేవాడు. కొద్ది రోజుల క్రితం అతను పరకాల నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డాడు. దీంతో ఆ యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అంతే కాదు ఆ యువకుడి ముఖం కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జు నుజ్జయి తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితునికి సరైన చికిత్స అందించకపోవడంతో బాధితుడు కోమాలోకి చేరుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి గార్డియన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే స్పందించి కోమాలోకి చేరుకున్న యువకునికి వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో రామచందర్ ముఖం మీదు ఎముకలు పూర్తి స్ధాయిలో నుజ్జవ్వడతో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎం ఉపేందర్, డాక్టర్ ఆర్శంతన్కుమార్ టీం కలిసి 12 గంటలపాటు శ్రమించి వెంటిలేటర్ సాయంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారని ఆయన వివరించారు. కన్ను, ముక్కుకు ఇబ్బందులు రాకుండా ప్లాస్టిక్ సర్జరీని విజయవంతం చేశారని తెలిపారు. దీంతో ఆ యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని డాక్టర్ కాళీప్రసాదరావు వెల్లడించారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి