ఉప్పొంగిన గోదావరి...భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Update: 2020-08-16 10:47 GMT
Representational Image

Godavari River Flood : ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వరద నీరు గోదావరిలో చేరి భద్రాచలం వద్ద ప్రవాహం భారీగా పెరుగుతోంది. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే వరద నీటితో గోదావరిలో 53 అడుగులకు ప్రవాహం చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలో మరింత వరద ఉధృతి పెరుగుతుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఎగువన నుంచి నీటి ప్రవాహం వస్తుండడంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రామయ్య ఆలయ అన్నదాన సత్రం, కల్యాణకట్ట, స్నానఘట్టాలు నీటమునిగాయి. భద్రాద్రి రామయ్య ఆలయ తూర్పు మెట్ల వరకు నీరు చేరింది. ఈ సందర్భంగా వరద ఉధృతిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిపై ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు.

గోదావరిలో వరద ఉధృతి పెరిగితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను మరికొంత మందిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 2005 తర్వాత ఖమ్మంలోని మున్నేరు వాగు మళ్లీ ఇప్పుడే ఉప్పొంగిందని, తాలిపేరు, కిన్నెరసారి తదితర ప్రాజెక్టులన్నీ పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరిందన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నీటిపారులశాఖ, ఇతర శాఖల అధికారులందరినీ అప్రమత్తం చేశామని, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పట్టణ ప్రజలకు స్థానిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేశారు.





Tags:    

Similar News