Hyderabad :‌ నకిలీ ఐపీఎస్... 11 కోట్లు లాగేసిన కిలాడి

Hyderabad: ఐపీఎస్ అధికారినంటూ ఎన్నెన్నో మాయమాటలు చేప్పి ఓ వ్యాపారి వద్ద 11కోట్ల టోకరా వేసింది.

Update: 2021-02-25 02:32 GMT

ఫైల్ ఇమేజ్


Hyderabad: ఐపీఎస్ అధికారినంటూ ఎన్నెన్నో మాయమాటలు చేప్పి ఓ వ్యాపారి వద్ద 11కోట్లు కాజేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది ఓ కిలాడి. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనూ,సీరియల్స్ ల్లోనూ చూస్తూ ఉంటాం. వివరాల్లోకి వెళితే

కడప నగరానికి చెందిన ఉద్దానం శిరీష (39) పదో తరగతి చదివింది. భర్తతో విడిపోయి సినిమాల్లో నటించాలనే ఆసక్తితో నగరానికొచ్చింది. స్మృతి సింహగా పేరు మార్చుకొని నటనలో శిక్షణ తీసుకొంది. అవకాశాలు రాకపోవడంతో బోరబండలో సింహ సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించింది. ఈ సమయంలో అవివాహితుడైన అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి(41) పరిచయమయ్యాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో 2017 డిసెంబరులో బాచుపల్లిలోని ప్రణవ్‌ అంటిల్లాలోని విల్లాకు మకాం మార్చారు. పక్క విల్లాలో ఉండే క్రషర్‌ యజమాని పి.వీరారెడ్డి పరిచయం అయ్యాడు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నానని, శిక్షణలో ఏర్పడిన గాయాల కారణంగా తాత్కాలికంగా ఇక్కడికి వచ్చానంటూ విజయ్‌కుమార్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. 72 ట్రావెల్స్‌ బస్సులకు యజమానినని నమ్మించాడు. తన భార్య అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ అని చెప్పాడు. సైరన్‌తో ఖరీదైన కార్లలో తిరుగుతుండటంతో బాధితుడు నిజమేనని భావించి వారితో మరింత సన్నిహితంగా మెలిగాడు.

విజయ్‌కుమార్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డిని సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా వీరారెడ్డికి పరిచయం చేశాడు. విజయ్‌కుమార్‌ మరి కొంద మంది కలసి వివిధ కారణాలు చెప్పి చేబదులుగా వీరారెడ్డి నుంచి రూ.11 కోట్లు తీసుకున్నారు. వీరారెడ్డికి తన సోదరినిచ్చి వివాహం చేస్తానంటూ వేరే యువతి ఫొటోలను పంపించి, గొంతు మార్చి తానే బాధితుడి సోదరుడితో తరచూ మాట్లాడేది స్మృతి. వీరారెడ్డి తిరిగి డబ్బులివ్వమని అడిగితే కాబోయే బంధువులమే కదా అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఆయనకు అనుమానమొచ్చి ఆరా తీయగా ఈ కేటుగాళ్ల మోసం బయటపడింది.

అప్పటి నుంచి తీసుకున్న డబ్బు చెల్లించాలంటూ విజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చాడు. బండారం బయటపడటంతో ఆందోళనకు గురైన విజయ్‌ కుమార్‌ ఈ నెల 5న ప్రగతినగర్‌లోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు వీరారెడ్డిని మోసం చేసినట్లు సెల్ఫీ వీడియో తీసుకొని అందరికీ పంపించాడు. దీంతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఖరీదైన 5 కార్లు(3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు), రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 46 క్రెడిట్‌ కార్డులు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News