రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇది చేదు వార్త అనే చెప్పుకోవాలి. గృహ, వాణిజ్య, వాప్యారాలు ఇలా అన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం పడనుంది. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుంది. దీంతో రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు చార్జీల పెంపునకు ప్రతిపాదనలు చేస్తున్నారు.
మూడేళ్లుగా విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నష్టాలు మూటగట్టుకుంటుండంతో ఛార్జీల సవరణకు విద్యుత్ శాఖ సిద్ధమయింది. ప్రతి ఏటా నవంబరు 30న ఏఆర్ఆర్ సమర్పించాల్సి ఉండగా ఈ సారి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉండంతో ఇప్పటి ఏఆర్ఆర్ ను అందించకుండా పెండింగ్లో ఉంచారు. కాగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఏఆర్ఆర్ (వార్షిక ఆదాయ అవసరాలు), ఛార్జీల టారిఫ్ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి డిస్కంలు సమర్పించనున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ శాఖ పంపిణీ చేస్తున్న డిస్కంలు దాదాపుగా 11వేల కోట్లు ఆర్థిక లోటుకు చేరిందని అధికారులు తెలిపారు. ఇక పోతే రాష్ట్రం ఏర్పడిని తరువాత నిరంతర విద్యుత్ ను అందిచేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కరెంటును కొంటున్నారని తెలిపారు. దీంతో 2019 సెప్టెంబరు నాటికి రూ.13,660 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ఇక ప్రతి రంగంలోనూ విద్యుత్తు ఎంతో అవసరం ఉండడంతో రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతుందని దీంతో ఇరత రాష్ట్రాలనుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ, ప్రజల డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నారని తెలిపారు. దాంతో డిస్కంల లోటు ఇంకా పెరుగుతూ వస్తోందని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై సబ్సిడీలు పెంచడంతో ఆ రాయితీ కూడా డిస్కంలపైనే పడుతోందని, ఆ బకాయిలు రాష్ట్రం సకాలంలో చెల్లించడం లేదని దీంతో నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
దీంతో విద్యుత్ శాఖ చార్జీలను పెంచనుంది. దీంతో ఆ భారమంతా మధ్యతరగతి, ఎగువతరగతి వారిపైనే పడనుంది. ఈ చార్జీలు పారిశ్రామిక కేటగిరీ స్వల్పంగా పెంచే అవకాశాలున్నాయి. నెలకు 300 యూనిట్లపైగా వినియోగించే ఎగువ తరగతి, 100–200 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి కుటుంబాలపైనే ఈ ప్రభావం ఎక్కువ చూపనుంది. ఈ చార్జీల పెంపు 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానుంది.