సూర్యపేట జిల్లాలో ఇవాళ్టి(శనివారం) నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 21 ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నిక కోడ్ వెంటనే అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన ప్రకటనలు చేయరాదన్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదన్నారు. హుజూర్నగర్ ఏపీ సరిహద్దులో ఉన్నందున మరింత నిఘా పెడతామన్నారు. మద్యం, డబ్బు సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు చెప్పారు. సి-విజిల్ యాప్ ద్వారా ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చని రజత్ కుమార్ పేర్కొన్నారు.