కరోనా నేపథ్యంలో తెలంగాణలో అడిగిందే తడవుగా జ్వరం, దగ్గు మందులు ఇవ్వరు. ఈ రోగాల మందులు కొనేవారు ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్ మెడికల్ షాపు వారికి ఇవ్వాలి. కరోనా లక్షణాలు ఉన్నవారు సొంతంగా మందులు వేసుకుంటూ, పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. వీరి ఆచూకీని మెడిలక్ షాపుల నుంచి ప్రభుత్వం సేకరించి కరోనాను కట్టడి చేయనుంది.
తెలంగాణలో ఇక నుంచి జ్వరం మాత్రలు కొంటే మీ ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్ కచ్చితంగా మెడికల్ షాపు వారికి ఇవ్వాల్సిందే. ఇప్పటి దాకా జ్వరం, గొంతునొప్పి లాంటి సమస్యలొస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే దగ్గర్లోని మెడికల్ షాపుల్లో పారాసిటమాల్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఇకపై వివరాలు ఇవ్వందే ఆ మాత్రలను విక్రయించరు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మెడికల్ దుకాణాలకూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఫీవర్ సర్వైలెన్స్ను నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో జ్వరంతో బాధపడే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని భావించిన సర్కారు మెడికల్ షాపుల నుంచే జ్వరపీడితుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది.
చాలా మందిలో కరోనా అనుమానిత లక్షణాలు ఉంటున్నా వారు పరీక్షలకు వెళ్లేందుకు వెనుకాడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారు మెడికల్ దుకాణా ల్లో జ్వరానికి పారాసిటమాల్, గొంతునొప్పికి అజిత్రోమైసిన్ లాంటి మెడిసిన్ను సొంతంగా తీసుకొని, వాడుతున్నారు. కొందరు కరోనా బారినపడ్డా పరీక్షలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారని అధికారుల పరిశీలనలో తేలింది.
తెలంగాణవ్యాప్తంగా 25 వేల దాకా మెడికల్ షాపులున్నాయి. మెడికల్ షాపులు, వారి అసోసియేషన్స్తో వెంటనే సమావేశమవ్వాలని అన్ని మునిసిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం అడుగుతున్న సమాచారాన్ని మెడికల్ షాపుల వారు విధిగా జాబితా రూపొందించి, ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ జాబితా ఆధారంగా మునిసిపల్, వైద్య ఆరోగ్య సిబ్బంది ఒక రిజిస్టర్ను ఏర్పాటు చేసి, అందులో వివరాలు నమోదు చేస్తారు. ఆ మందులు కొనేవారికి ఫోన్లు చేసి, ఆరోగ్యం గురించి ఎంక్వయిరీ చేస్తారు. అవసరమైతే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.