సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Update: 2020-10-08 14:00 GMT

ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్న నేరాల మాదిరిగా తెలంగాణలో కూడా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్‌ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్శించారు. బుధ‌వారం శాంతి భ‌ద్రత‌ల‌పై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆదర్శంగా ఉన్నాయని అనడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ కూడా ఉత్తర్ ప్రదేశ్‌లా మారిపోతుందని ఆయన విమర్శించారు. కేసీఆర్‌కు సిగ్గు ఉందా..! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరిగిన ఘటనలు మరింతగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు.

గురువారం హైదరాబాద్‌లోని హోమ్ మంత్రి ఇంటిని సంపత్ ముట్టడించారు. ఖ‌మ్మం జిల్లాలో మైన‌ర్ బాలిక‌పై రేప్ జరిగినందుకు ఆయన ఈ నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒక్క టీఆర్ఎస్ నేత అయినా పరామర్శించాడా? అని సంపత్ సూటిగా ప్రశ్నించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ వెంటనే రాజీనామా చేయాలని సంపత్‌ డిమాండ్ చేశారు. దోషులకు కఠిన శిక్షపడేవరకూ వదలొద్దని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంపత్‌ కుమార్ తో పాటు కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News