ఆన్లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : హైదరాబాద్ సీపీ
రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుండడంతో నగరంలో ఇటు ప్రభుత్వం, అటు పోలీస్ శాఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుండడంతో నగరంలో ఇటు ప్రభుత్వం, అటు పోలీస్ శాఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధించారు. దీంతో ఎవరూ కూడా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దని, ఫుడ్ డెలివరీకి కూడా ఎవరూ వెళ్లకూడదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషన్ అంజనీకుమార్ అన్నారు. మొన్నటికి మొన్న నగరంలో ఓ ఫుడు డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని, అతని ద్వారా మరికొంత మందికి వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో పూర్తిగా 124 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని ఆయన స్పస్టం చేసారు.
ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా ఉండేందుకు నగరంలో 12 వేల మంది పోలీసు సిబ్బంది 24 గంటలపాటు విధుల్లో ఉంటున్నారని తెలిపారు. నగరంలో ఉండే నిరుపేదలు, వలస కూలీల కోసం దాతలు, జీహెచ్ఎంసీ సహకారంతో నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, సబ్బులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఇప్పటి వరకు రోడ్లపైకి వచ్చిన 69 వేలకుపైగా వాహనాలను సీజ్ చేశామని ఆయన అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 49 వేల మందిపై కేసులు నమోదుచేశామని వెల్లడించారు.