Revanth Reddy: పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయంపై ముఖ్యమంత్రి దృష్టి

Update: 2024-05-17 07:27 GMT

Revanth Reddy: పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

Revanth Reddy: గత నెల రోజులుగా ఎన్నికల బిజీలో గడిపిన సీఎం రేవంత్ రెడ్డి.. తిరిగి పాలనపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వనికి ఆదాయం వచ్చే వాటిపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓవైపు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ప్రతిపక్ష పార్టీలు విమర‌్శలు చేస్తున్ననాయి. మరోవైపు సంక్షేమాలను అమలు చేయాలంటే.. ప్రభుత్వానికి నిధులు అవసరం. ప్రస్తుతం ఇదే పనిమీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందకు.. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే నిన్న ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏ ఏ శాఖల ద్వారా.. ఎంత ఆదాయం వస్తుంది అన్న విషయాలపై ఆరా తీశారు.

ముఖ్య కార్యదర్శులతో సమావేశమై ఆదాయం సమకూరే మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సమవేశమై... రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపాడానికి ఎలాంటి నిర్ణయాలు అవసరమో చర్చించారు.

గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకు ఆనెల టార్గెట్‌ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అక్రమ మద్యంపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఇక హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి. కానీ అదే స్థాయిలో రెవిన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమనని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా.. అనేది కూడా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Tags:    

Similar News