ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ.. ‘జయజయహే తెలంగాణ’కు కొత్త ట్యూన్
రాష్ట్రీయ గీతాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు
ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ.. ‘జయజయహే తెలంగాణ’కు కొత్త ట్యూన్
CM Revanth Reddy: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మంగళవారం(మే 21) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విషయమై సీఎం వీరితో చర్చించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో త్వరలో జయజయహే పాట సరికొత్త బాణీతో అలరించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరుంది. ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ను అందెశ్రీ రచించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యాసంస్థల్లో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో ప్రార్థనా గీతంగా ఈ పాటను పాడుకుంటారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక జయజయహే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.