ఇలాగే సహకరించిండి.. కరోనాపై విజయం సాధిస్తాం : కేసీఆర్
లాక్ డౌన్ కి ప్రజలు ఇలాగే సహకరిస్తే కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
లాక్ డౌన్ కి ప్రజలు ఇలాగే సహకరిస్తే కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం జరిపిన పరీక్షల్లో 15 మందికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఇలాగే లాక్ డౌన్ కి ప్రజలు సహకరిస్తే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలున్నాయన్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. అనంతరం వారు నేరుగా ప్రగతి భవన్ చేరుకుని ముఖ్యమంత్రికి అక్కడి పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
ఇక ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించామని అన్నారు. వారి ద్వారా ఎవరెవరికి వైరస్ సోకే అవకాశం ఉందో కాంటాక్టు లిస్టు తయారు చేసి పరీక్షలు జరిపామని స్పష్టం చేశారు.. దీని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామని, అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించామని అన్నారు. దీని కారణంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగామని అన్నారు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదే విధంగా సహకరించి లాక్ డౌన్ నిబంధనలను, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.