నీళ్లు, నిధులే ప్రధాన అజెండాగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్... ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమైన కేసీఆర్.... ముఖ్యంగా ఏపీలో కలిసి తలపెట్టిన గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై చర్చించారు. అలాగే, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వాలని కోరారు.
అమిత్షాతో మీటింగ్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీని కలిసిన సీఎం కేసీఆర్.... ప్రధానంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థలో మార్పులకు ఆమోదం, రిజర్వేషన్ల పెంపునకు అనుమతి, యురేనియం తవ్వకాల నిలిపివేత... వెనుకబడిన జిల్లాలకు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు నిధుల కేటాయింపు... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు ఉంచారు. అదేవిధంగా, ఆయుష్మాన్భవ నిధులు ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు రక్షణశాఖ భూములను ఇవ్వాలంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం కేసీఆర్... తెలంగాణ అవసరాలు, సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.