ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు తప్పని ఎదురుచూపులు.. సీఎం వెనుదిరగడంపై సెటైర్లు వేస్తున్న..

CM KCR: అంతన్నారు.. ఇంతన్నారు.. తాడేపేడో తేల్చుకుంటానన్నారు.

Update: 2021-11-25 11:06 GMT

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు తప్పని ఎదురుచూపులు.. సీఎం వెనుదిరగడంపై సెటైర్లు వేస్తున్న..

CM KCR: అంతన్నారు.. ఇంతన్నారు.. తాడేపేడో తేల్చుకుంటానన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ గర్జన చూపిస్తానంటూ ఢిల్లీ ఫ్లైటెక్కారు. తీరా చూస్తే నాలుగు రోజులు మకాం వేసి ఎవరినీ కలవకుండానే తిరిగి హైదరాబాద్ వచ్చారు. అసలు ఏం చెప్పి వెళ్లారు ? ఏం చేసి వచ్చారు ?

యాసంగిలో వరి సాగుపై కేంద్రంతో ఏదో ఒకటి తేల్చుకొనే వస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌‌కు ఎదురుచూపులు తప్పలేదు. హస్తిన పర్యటనలో కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. అయితే ప్రధాని, కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణంగా సమయం ఇవ్వలేదని బీజేపీ నేతలు చెబుతుంటే బుధవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎలా కలిసారని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆదివారం సాయంత్రం హస్తిన చేరుకున్న సీఎం కేసీఆర్ తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో రెస్ట్ తీసుకున్నారు. సోమవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రుల అపాయింట్‌‌మెంట్‌ కోసం ట్రై చేశారు. మంగళవారం నాటికి కూడా అపాయింట్మెంట్‌‌‌పై ప్రధాని ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇక బుధవారం సైతం ప్రధానిని కలవడం కష్టమేనని అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆ సాయంత్రం హైదరాబాద్‌ బాట పట్టారు.

దీంతో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. బీజేపీ, సీఎం కేసీఆర్ కలిసి డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు సీఎంను కలవలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాక సీఎం హస్తిన పర్యటన వల్ల ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బిల్లులు రెట్టింపవ్వడం తప్పా మరో ప్రయోజనం ఉండదని ఆరోపిస్తున్నారు. రోడ్ల మీద ఆరబెట్టిన వరి ధాన్యం మొలకెత్తి మరోసారి కాపుకొచ్చే సమయం వరకూ కేసీఆర్, కేంద్రం ఇలానే డ్రామాలాడుతారని అంటున్నారు. మొత్తానికి ధాన్యం సేకరణ అంశం ముగిసిన అధ్యయమని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

Tags:    

Similar News