టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం ముమ్మాటికి సరైందే అంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. రాజ్యంగ బద్దంగానే విలీనం చేశామని నోరు జారితే ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తుపై భరోసా లేకనే పార్టీ మారామని అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరో వైపు టీఆర్ఎస్లో సీఎల్పీవిలీనం చేయడంపై హైకోర్టు మరోసారి తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.
టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై విమర్శలను తిప్పికొట్టారు టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాజ్యాంగానికి లోబడే టీఆర్ఎస్ లో సీఎల్పీనీ విలీనం చేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యంగం కల్పించిన హక్కు ప్రకారం సీఎల్పీని విలీనం చేయాలని కోరామని చట్టప్రకారం విలీనం జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ కండువ కప్పుకోలేదన్నారు ఎమ్మెల్యే రేగ కాంతారావు. పదవుల కోసం చిల్లరమల్లరగా తిడితే ఊరుకునేది లేదని పరువు నష్టం దావా వేస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. త్రిపుర, గోవాల్లోనూ ఇలాంటి విలీనాలు జరిగాయని గుర్తు చేశారు.
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే తాము పార్టీ మారామన్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. 2014 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదన్నారు. స్పీకర్ కు, సీఎం కేసీఆర్ కు లేఖలు రాసిన తర్వాతే సీఎల్పీ టీఆర్ఎస్ లో విలీనం నిర్ణయం తీసుకుని గెజిట్ విడుదల చేశారని టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తెలిపారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టి విక్రమార్క తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పార్టీలో లోపాలను సరిదిద్దుకోవాలని విలీన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారు. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యంగ విరుద్దమంటూ హైకోర్టులో దాఖలనై పిటీషన్ ను విచారించిన కోర్టు స్పీకర్ కు నోటీసులు జారీ చేసంది. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.