కేవలం పూజలు పునస్కారాలే కాదు మెరుగైన సమాజం తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ముందుకొచ్చారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్. ఆడపిల్లలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, అఘాయిత్యాలను చూసి కలత చెందిన రంగరాజన్ మహిళల రక్షణ కోసం జటాయువు పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేశారు. జటాయువు జయంతి సందర్భంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆధ్వర్యంలో ఇవాళ జటాయువు సైన్యాన్ని ప్రారంభించారు.
తొలి జటాయువుగా హైదరాబాద్ కార్వాన్కి చెందిన నదీమ్ను ఎంపికచేసి సన్మానించారు. నెలరోజుల కిందట మొయినాబాద్లో దుండగులు పదేళ్ల బాలికపై కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, నదీమ్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. బాలిక కేకలు విని, దుండగులను వెంబడించిన నదీమ్ కిడ్నాపర్ల నుంచి బాలికను కాపాడి పోలీసులకు అప్పగించాడు. అందుకే, నదీమ్ను తొలి జటాయువుగా ఎంపిక చేసినట్లు రంగరాజన్ తెలిపారు. అయితే, ఈ సందర్భంగా చాలామంది యువకులు జటాయువు సైన్యంలో చేరుతున్నట్లు ప్రమాణం చేశారు.
ఇటీవల హన్మకొండలో హత్యాచారానికి గురైన తొమ్మిది నెలల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన రంగరాజన్ మానవ మృగాల నుంచి ఆడపిల్లలను కాపాడేందుకు జటాయువు సైన్యాన్ని ఏర్పాట్లు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఇవాళ జటాయువు ఆర్మీకి అంకురార్పణ చేశారు. అయితే, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి జటాయువు సైన్యం వేగంగా పెరగాల్సిన అవసరముందన్నారు. ప్రతి ఒక్కరూ రామాయణంలో సీతను ఎత్తుకెళ్తుండగా, రావణుడితో పోరాడిన జటాయువుగా మారి, మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.