పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు కల్పించాం : కేంద్ర మంత్రి పియూష్ గోయల్
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు పంట ఎగుమతులపై బోర్డు ప్రత్యేక దృష్టి సారించనుంది. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కూడా ఈ బోర్డ్ పని చేయనుంది.
పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయని పియూష్ గోయల్ తెలిపారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దాని కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామన్నారు. రైతుల డిమాండ్ నెరవేర్చాము కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.