బస్సులను పునరుద్ధరించాలి
హైదరాబాద్ ఓయూ క్యాంపస్ నుంచి గతంలో తిరిగిన లోకల్ సిటీ బస్సులను కొన్నింటిని ఆర్టీసీ సమ్మె తరువాత రద్దు చేశారు.
హైదరాబాద్ ఓయూ క్యాంపస్ నుంచి గతంలో తిరిగిన లోకల్ సిటీ బస్సులను కొన్నింటిని ఆర్టీసీ సమ్మె తరువాత రద్దు చేశారు. ఈ బస్సుల తిరగక పోవడంతో చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులను ఎదుర్కొటున్నారని విద్యార్థులు తెలుపుతున్నారు. గతంలో క్యాంపస్ మార్గం నుంచి చాలా బస్సులు నడిచేవని ప్రస్తుతం వాటిని వేరే మార్గం నుండి నడిపిస్తున్నారన్నారు. చాలా మంది విద్యార్థులు ఓయూ క్యాంపస్ నుంచి కోఠిమహిళా కాలేజీ, నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీలకు వెలుతుంటారు.
అంతే కాకుండా ఉద్యోగాలకు, కోచింగ్ సెంటర్లకు వెలుతుంటారన్నారు. కానీ క్యాంపస్ నుంచి ఇతర ప్రదేశాలకు బస్సులు తిరగక పోవడంతో వారు ఆటోలు, ఓలా క్యాబ్, రాపిడోల వంటి ప్రయివేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది.
సుదూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ బస్సులు క్యాంపస్ మీదుగా వెలుతుంటే లోకల్ బస్సులు మాత్రం క్యాంపస్ వెనుక మార్గం నుంచి వెళుతున్నాయని, దీని వల్ల విద్యార్థులు, వారితో పాటు అవసరం నిమిత్తం ఓయూ క్యాంపస్కు వచ్చే వారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గతంలో తార్నాక నుంచి కోఠి, నాంపల్లికి 3, 136 నంబర్ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్లేవని తెలిపారు.
ఆ బస్సులు ఆర్ట్స్ కాలేజీ, లా కళాశాల, లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ కాలేజీ ఆంధ్రమహిళా సభ విద్యా సంస్థల బస్ స్టాప్ వద్ద ఆగేవన్నారు. ఆ బస్సులను నడుపుతున్నప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యాంగా ఉండేదన్నారు. ఈ బస్సులను వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థులు, ఆ పరిసర ప్రాంత వాసులు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు.