DK Aruna on Coronavirus: కరోనా హబ్గా హైదరాబాద్
DK Aruna on Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపవుతున్న విషయం తెలిసిందే.
DK Aruna on Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆదివారం పార్టీ ఎంపీ సోయం బాపూరావుతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే హైదరాబాద్ నగరం కరోనా హబ్గా మారిందని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్కు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మీద ఉన్న కోపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపమైందని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్కు వాస్తవాలు తెలిసినా, సీఎంను ప్రశ్నించలేక పదవిని కాపాడుకునే పనిలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
టీఆర్ఎస్లో ఓనర్లు, క్లీనర్ల పంచాయితీ నడుస్తోందని, వైరస్ను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ చేస్తున్న శవ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు బలిపశువులు అవుతున్నారన్నారు. జిల్లా వైద్యాధికారులు చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెలువరి స్తున్న కరోనా కేసుల సంఖ్యకు పొంతన లేదన్నారు. హరితహారం పేరుతో ఊర్లు తిరుగుతున్న సీఎంకు హైదరాబాద్లోని ఆస్పత్రులను సందర్శించే బాధ్యత లేదా అని నిలదీశారు. కేంద్రం కేటాయించిన నిధులు రూ.7,151 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చిన విరాళాల నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చుపెట్టారో చెప్పే నిజాయితీ కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తేవాలని, లేదంటే ఆయుష్మాన్ భారత్లో చేర్చాలని కోరారు.