కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ తో నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. పేదలకు పది కిలోల బియ్యిం, కిలో కందిపంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, 15 వందల రూపాయల పెన్షన్ జన్ ధన్ ఖాతా ద్వారా డబ్బులు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే రేపు రాత్రి తొమ్మిది గంటలకు ఇంట్లోని లైట్లు ఆర్పి తొమ్మిది నిమిషాల పాటు ఇంటి ముందు లేదా బాల్కనీల్లో దీపాలు వెలిగించి సంకల్పస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ తలపెట్టిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీపై బండి సంజయ్ మండిపడ్డారు. మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ దీపం వెలిగించమంటే దానిని కూడా మతకోణంతో చూడటం ఒవైసీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. వైద్యులకు కృతజ్ఞత తెలపడం ఒవైసీకి కనీసం తెలీదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి హితవుపలికారు. దేశ ఐక్యతకు మోదీ ఈ కార్యక్రమం పిలుపునిచ్చారని సంజయ్ గుర్తుచేశారు. ఆదివారం రాత్రి దారుసలేం వెళ్లి చూస్తూ ప్రజల స్పందన కనువిందు చేస్తుందని అన్నారు.