లాల్ దర్వాజ అమ్మవారి టెంపుల్ అభివృద్దికి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తపిస్తున్నారు. ఔను. మీరు విన్నది నిజమే. హిందూ దేవుళ్లపై గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్, అమ్మవారి ఆలయ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారట. ఇందుకోసం, ఏకంగా సీఎం కేసీఆర్ను కలిసి, వినతీపత్రం ఇచ్చారు. పాతబస్తీ ఎమ్మెల్యేగా అక్కడి గుడి అభివృద్దికి నిధులు అడిగారులే అనుకోవచ్చు. కానీ అమ్మవారి ఆలయ అభివృద్ది కోసం నిజంగానే, అక్బరుద్దీన్ ఆలోచిస్తున్నారు. అయితే, దీని వెనక ఆయనకు ఒక మొక్కుంది. ఆ మొక్కు తీర్చుకునేందుకే అమ్మవారి ఆలయ డెవలప్మెంట్ కోసం ప్రణాళిక రూపొందించారు. ఎంఐఎం ఎమ్మెల్యే ఏంటి? మొక్కేంటనేగా మీ డౌట్. అయితే ఆ మొక్కు వెనకున్న ఇంట్రెస్టింగ్ విషయమేంటో ఒకసారి చూడండి.
ఏఐఎంఐఎం ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం, లాల్ దర్వాజ టెంపుల్ అభివృద్దికి నిధులు అడగటం, కేసీఆర్-అక్బర్ భేటి వెనక కుట్ర వుందని, ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడం, రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చకు దారి తీసింది. ముస్లిం పార్టీగా ముద్రపడిన ఎంఐఎం ఎమ్మెల్యే ఏంటి హిందూ ఆలయ అభివృద్దికి తపించడమేంటన్నదానిపై ఎవరికి వారు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.
అమ్మవారి ఆలయం కోసం అక్బరుద్దీన్ ఇంతగా తపించడమేంటి?
దీని వెనక రెండు అంశాలు ప్రచారంలో వున్నాయి. ఒకటి రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో హిందూ ఓట్లను సైతం ఆకర్షించడమన్న ప్రచారం వుంది. టీఆర్ఎస్-ఎంఐఎం కలిసి ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే, స్నేహపూర్వకంగా పోటీ చేసి, ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకోవడం వంటి పరిణామాలుండొచ్చు. అందుకే ఎంఐఎంకి సైతం హిందూ ఓట్లు ఆకర్షించేందుకు, లాల్ దర్వాజ ఆలయాభివృద్దికి నిధులు అడగారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఎన్నికలు, హిందూ ఓట్ల ఆకర్షణ కంటే కూడా, ప్రచారంలో వున్న మరో విషయం ఆసక్తి కలిగిస్తోంది.
అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకే అక్బరుద్దీన్ తపిస్తున్నారా? లాల్ దర్వాజ మాతకు అక్బరుద్దీన్ మొక్కేంటి?
హిందూ దేవుళ్లపై వివాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్కు, అమ్మవారి మొక్కేంటని, అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు. ముస్లిం పార్టీగా ముద్రపడి, పాతబస్తీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హిందూ-ముస్లిం ఓట్ల విభజనతో గెలిచే ఎంఐఎం నేతకు, మహంకాళీ అమ్మవారికి మొక్కేంటని అనిపించొచ్చు. కానీ మొక్కు నిజమంటున్నారు అక్బరుద్దీన్ సన్నిహితులు. ఆ విషయం తెలిసినందుకే, సీఎం కేసీఆర్ సైతం నిధుల విడుదలపై సానుకూలత వ్యక్తం చేశారన్న మాటలు వినపడ్తున్నాయి. ఇంతకీ ఆ మొక్కేంటి?
గతంలో అక్బరుద్దీన్పై కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలుసు. ఒంట్లోకి తూటాలు దిగబడ్డాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. మృత్యువుతో పోరాడి గెలిచారు. ఇప్పటికీ అక్బర్ బాడీలో తూటా వుంది. అక్బర్ ఇలా ప్రాణాపాయస్థితిలో వున్నప్పుడు, లాల్ దర్వాజ అమ్మవారికి ఆయన భార్య మొక్కుకున్నారన్న ప్రచారం వుంది. అక్బరుద్దీన్ ఇద్దరు భార్యల్లో ఒకరు క్రిస్టియన్ అట. ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్ అట. అందుకే హిందూ దేవుళ్లనూ నమ్ముతారట. తన భర్త మృత్యువుతో పోరాడుతున్నటైంలో, భక్తుల కోర్కెలు తీర్చే మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారట భార్య. ప్రాణాపాయం నుంచి బయటపడితే, ఆలయ అభివృద్దికి పాటుపడతామని అనుకున్నారట. అక్బరుద్దీన్ ఇప్పుడు ఆరోగ్యంతో వున్నారు. అందుకే ఆ మొక్కు తీర్చుకోవాలని, భర్త అక్బరుద్దీన్పై ఒత్తిడి తెస్తున్నారట భార్య. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ను కలిసి, లాల్ దర్వాజ ఆలయాభివృద్దికి నిధులు విడుదల చేయాలని కోరారట అక్బరుద్దీన్.
మరోవైపు పాతబస్తీ ఆర్డీవో ద్వారా ఆలయ కమిటీతో ఎస్టిమేషన్ వేయించి, అదే కమిటీ అంచనాను వినతీపత్రం రూపంలో ఇచ్చారట అక్బరుద్దీన్ ఒవైసీ. అక్బరుద్దీన్, కేసీఆర్ భేటీ వెనుక కుట్ర ఉందన్నారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. అక్బరుద్దీన్ హిందువులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే తర్వాతే హిందూ దేవాలయాలపై నిధులు కోరాలన్నారు. తాము ఫోన్ చేసినా, మెయిల్ చేసినా సీఎం స్పందించరు కానీ ఎంఐఎం ఎమ్మెల్యేతో మాత్రం మీటింగ్ అవుతారని ఆరోపణలు చేశారు రాజా సింగ్. లాల్ దర్వాజ అమ్మవారి టెంపుల్ అభివృద్దికి నిధులు కేటాయించాలంటూ తాము ఎన్నిసార్లు అడిగినా స్పందించని సీఎం, ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అడిగిన తక్షణమే సానుకూలంగా రియాక్ట్ అయ్యారన్నారు రాజాసింగ్.
మొత్తానికి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయే అక్బరుద్దీన్ ఒవైసీ, ఒక హిందూ దేవత గుడి అభివృద్దికి పూనుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. దీని వెనక రాజకీయ కారణాలున్నాయా..? లేదంటే నిజంగానే మొక్కుందా అన్న అంశాల్లో, ఏది నిజం అన్నది, వారికే తెలియాలి.