Hyderabad: గ్రేటర్‌లో మరోసారి కరోనా కలకలం

Hyderabad: రాజేంద్రనగర్ బాలుర హాస్టల్‌లో ఆందోళన * 22 మంది విద్యార్థులతో పాటు వార్డెన్‌, వాచ్మెన్‌కు కరోనా

Update: 2021-03-19 00:56 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: అంతా అయిపోయిందనుకున్నారు. భయాన్ని కూడా వదిలేశారు. కానీ ఇప్పుడు మళ్లీ గుబులు పట్టుకుంది. ఆ మాయదారి కరోనా మనల్ని వదిలేలా లేదు. పాపం అబం శుభం తెలియని విద్యార్థులను కూడా వెంటాడుతోంది. మొన్న నాగోల్‌లో స్టూడెంట్స్ ని టచ్‌ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28మంది విద్యార్థులను పలకరించింది. అసలు పిల్లలను స్కూల్‌కు పంపించాలా వద్దా అన్న డైలామాలో పడుతున్నారు తల్లిదండ్రులు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి కరోనా కలకలం రేగింది. నగర శివారులోని రాజేంద్రనగర్ బాలుర హాస్టల్‌లో 22 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హాస్టల్ వార్డెన్‌తో పాటు వాచ్మెన్‌కు కూడా వైరస్ సోకింది. విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో తల్లిదండ్రులు స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజేంద్రనగర్‌ పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 52 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా, మరో ఇద్దరికి కరోనా సోకినట్లు గుర్తించారు.

మరోవైపు, శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకిన విద్యార్థులను హోం ఐసోలేషన్‌కు పంపించారు.

స్కూల్‌ విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ 8తరగతి వరకు సెలవులు ప్రకటించే విషయమై చర్చించారు. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

Tags:    

Similar News