Warangal: వరంగల్లో దారుణం.. డబ్బుకోసం కొడుకును అమ్ముకున్న తండ్రి
Warangal: రెండున్నర లక్షలకు కొడుకును అమ్మిన మసూద్
వరంగల్లో దారుణం.. డబ్బుకోసం కొడుకును అమ్ముకున్న తండ్రి
Warangal: వరంగల్లో దారుణం జరిగింది. డబ్బు కోసం కన్నతండ్రే బిడ్డను అమ్ముకున్నాడు. విషయం తెలిసి బాలుడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పెంచుకోవడానికి బంధువులకు ఇచ్చానంటూ ఆ తండ్రి బుకాయించాడు. దీంతో బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు వరంగల్ జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు.
వరంగల్ కరీమాబాద్కు చెందిన మసూద్ తన కొడుకు అయాన్ను అమ్మేయాలని ప్లాన్ వేశాడు. హైదరాబాద్లోని ఓ కుటుంబానికి అమ్మడానికి రెండున్నర లక్షలకి బేరం కుదుర్చుకున్నాడు. దీనికి ఓ మహిళ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన కుటుంబం రెండున్నర లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. దీనికి అంగీకరించిన మసూద్ నాలుగు రోజుల క్రితం పెద్దకొడుకును తీసుకెళ్లి వారికి అప్పగించాడు. అయితే, నాలుగు రోజులుగా అయాన్ కనిపించకపోవడంతో తల్లి భర్తను నిలదీసింది. కొడుకుని ఎక్కడికి తీసుకెళ్లావంటూ ప్రశ్నించింది.
మొదట మసూద్ అయాన్ను తన సోదరి దగ్గర ఉంచినట్లు తెలిపాడు. కానీ, అతని మాటల మీద అనుమానం వచ్చిన భార్య.. ఆమెను కనుక్కోగా అక్కడ అయాన్ లేడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి మసూద్ను నిలదీశారు. రెండున్నర లక్షలకు బాబును అమ్మేసినట్లుగా చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక బాలుడి మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి మొత్తం ఐదుగురికి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని తేల్చారు.