నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో.. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఎద్దును గ్రామస్తులు రక్షించారు. కిష్టమ్మ అనే మహిళా రైతుకు చెందిన ఎద్దు మేతకు వెళ్లి గ్రామ శివారులోని ఓ బావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎద్దును బయటకు తీసేందుకు కష్టపడాల్సి వచ్చింది. సర్పంచ్ మాణిక్యమ్మ మండల రెవెన్యూ అధికారులకు సమాచారం అందించింది. తహశీల్దార్ భీమయ్య తన సిబ్బందితో భావి దగ్గరకు చేరుకుని ఎద్దును రక్షించే పనిలో పడ్డారు.
20 అడుగుల లోతు ఉన్న బావిలో నీరు ఉండటంతో ముందుగా ఆ నీటిని మోటార్ల ద్వారా తోడిపోశారు. ఆ తర్వాత భారీ క్రేన్ను తీసుకొచ్చిన గ్రామస్తులు.. దాని సాయంతో ఎద్దును బయటకు తీశారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఎద్దును సురక్షితంగా రక్షించారు.