బెంగళూరు భారీస్కోరైతే చేసింది... కానీ చావుతప్పి కన్నులొట్టపోయి గెలిచింది. కోల్కతా హిట్టర్లు రసెల్, రాణా సూపర్ ఇన్నింగ్స్ ఆడినా.. ఈ మ్యాచ్ ఆఖరి మూడు బంతుల్లో బెంగళూరుకు గెలుపు మలుపు తిరిగి. చివరకు రాయల్ చాలెంజర్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లి (58 బంతుల్లో 100; 9 ఫోర్లు, 4 సిక్స్లు) శతక్కొట్టగా, మొయిన్ అలీ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మోత మోగించాడు. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేసిన విజయానికి అడుగు దూరంలో ఆగిపోయింది.
భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా నైట్రైడర్స్ను స్టెయిన్ చావు దెబ్బ తీశాడు. అతను వేసిన తొలి ఓవర్లోనే లిన్ (1)ను పెవిలియన్ కు పంపించాడు. ఆ తరువాత మూడో ఓవర్లో శుబ్మన్ గిల్ (9)ను ఔట్ చేశాడు. నరైన్ (18) సైనీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ దశలో 33 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన జట్టును నితీశ్ రాణా ఆదుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులే చేసింది. ఉతప్ప (9) కూడా విఫలమవగా... రాణాకు రసెల్ జతయ్యాడు. దీంతో రాణా సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసేదాకా 101/4 స్కోరుతో ఉన్న కోల్కతా ఇన్నింగ్స్లో 15వ ఓవర్ నుంచి రసెల్ గర్జన మొదలైంది. చహల్ వేసిన ఆ ఓవర్లో రసెల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. 16వ ఓవర్ వేసేందుకు వచ్చి సైనీకి రాణా ఇదే ఇనుభవం ఎదురైంది. ఈ దశలో జట్టు స్కోరు 153/4కు చేరింది. ఇక మూడు ఓవర్లు మిగిలాయి. కోల్కతా విజయానికి 18 బంతుల్లో 61 పరుగులు కావాలి. స్టెయిన్ బౌలింగ్లో రాణా చెలరేగాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చేశాయి. ఇక ఆఖరి ఓవర్కు 24 పరుగులు చేయాల్సి వుండగా... కోహ్లి బంతి మొయిన్ అలీకిచ్చాడు. 4 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్ కొట్టిన రసెల్ ఒక బంతి బీట్ అయ్యాడు. ఐదో బంతికి రనౌటయ్యాడు. రాణా సిక్సర్తో ఆట ముగించగా... బెంగళూరు విజయం సాధించింది. దీంతో కోహ్లీ సేన ఊపిరి పీల్చుకుంది.