ఐపీఎల్ లో ముందుకెళ్లే దారులు బెంగళూరుకు దాదాపు మూసుకుపోయాయి. సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగుకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. మొదట కోహ్లి (8)ని, తర్వాత పార్థివ్ (28) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 49/2. ఈ దశలో డివిలియర్స్కు జతయిన మొయిన్ అలీ సిక్సర్లతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్కు 10.1 ఓవర్లలోనే ఇద్దరు కలిసి చకచకా 95 పరుగులు జోడించారు. డివిలియర్స్ 49 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్లు), అలీ 31 బంతుల్లో (1 ఫోర్, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం మలింగ... అలీతో పాటు స్టొయినిస్ (0)లను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. డివిలియర్స్ (75; 6 ఫోర్లు, 4 సిక్స్లు), మొయిన్ అలీ (50; 1 ఫోర్, 5 సిక్స్లు) మంచి ప్రదర్శనే ఇచ్చారు.
మొత్తంగా బెంగుళూరు జట్టు 172 పరుగులు చేసింది. అయితే దురదృష్టం వారిని వెంటాడుతూనే ఉంది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ముంబై ఓపెనర్లు డికాక్ 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రోహిత్ శర్మ (28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. దీంతో జట్టు 4.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. వీళ్లిద్దరు పరుగు తేడాతో 71 స్కోరు వద్ద పెవిలియన్ కు చేరారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ధాటిని కొనసాగించారు. ముంబై ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మంచి ప్రదర్శన ఇచ్చాడు. 19వ ఓవర్లో అతను వరుసగా 6, 4, 4, 6తో 22 పరుగులు చేయడంతో మరో ఓవర్ మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని అధిగమించింది. కాగా చహల్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు తీశారు. ఇక ఆర్సీబీ ఖాతాలో ఏడో ఓటమిగా నమోదైంది.