ముంబై ఇండియన్స్ మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్లో భాగంగా స్థానిక ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. ముంబై స్పిన్నర్ రాహుల్ చహర్(3/19), బుమ్రా(2/18) ధాటికి ఢిల్లీ విలవిల్లాడింది. ముంబై బౌలర్ల కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుసగా వికెట్ల తీయడంతో ఢిల్లీ ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై జట్టు ఇనింగ్స్ ను ఓపెనర్లు రోహిత్ శర్మ-డీకాక్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగులు జోడించిన తరువాత రోహిత్ శర్మ(30) ఔటయ్యాడు. ఆపై బెన్ కట్టింగ్(2) నిరాశపరచగా, కాసేపటికి డీకాక్(35) కూడా రనౌట్ గా పెవిలియన్ బాటపట్టాడు. దాంతో ముంబై 74 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన
సూర్యకుమార్ యాదవ్(26) ఫర్వాలేదనిపించగా, కృనాల్ పాండ్యా-హార్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇక్కడ హార్దిక్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, కృనాల్ 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 49 పరుగులు జోడించిన తరువాత శిఖర్ ధావన్(35) రాహుల్ చహర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం ధావన్తో ఢిల్లీ వికెట్ల పతనం మొదలయింది. మరో యువ ఓపెనర్ పృథ్వీ షా(20) కూడా ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. ఢిల్లీ ప్రధాన బ్యాట్స్మెన్ అయ్యర్(3), పంత్(7), మున్రో(3)లు పూర్తిగా నిరాశపరిచారు. చివర్లో అక్షర్ పటేల్(26) రాణించినా ఢిల్లీ ఓటమిపాలైంది.