India Playing 11: భారత్ మాస్టర్ ప్లాన్.. నంబర్ 3లో ఆడేది తిలక్ కాదు, తుది జట్టు ఇదే!
బ్యాటింగ్ ఆర్డర్లో కీలక మార్పులు… ప్రత్యర్థిని ఆశ్చర్యపరిచే కాంబినేషన్తో మైదానంలోకి దిగే టీమిండియా!
India Playing 11: భారత్ మాస్టర్ ప్లాన్.. నంబర్ 3లో ఆడేది తిలక్ కాదు, తుది జట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సూపర్-8 మ్యాచ్లు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. శనివారం రాత్రి 7 గంటలకు కొలంబోలో పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్, దక్షిణాప్రికా మ్యాచ్ ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. సూపర్-8 మొదటి మ్యాచ్లోనే గెలిచి సెమీస్ చేరేందుకు బాటలు వేసుకోవాలని రెండు టీమ్స్ బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్కు ముందు భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ ఆసక్తికరంగా మారాయి. ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ అందించిన తాజా సమాచారం ప్రకారం.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
యువ ఆటగాడు తిలక్ వర్మను కాకుండా.. సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ను నంబర్ 3 స్థానంలో బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లో జరిగిన నెట్ ప్రాక్టీస్లో సంజూ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. గత సెషన్లలో అతనికి తక్కువ సమయం కేటాయించినప్పటికీ.. ఈసారి మాత్రం సుదీర్ఘంగా నెట్స్లో గడిపాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. సంజూ తుది జట్టులో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూకు ఉన్న నైపుణ్యాన్ని ఈ కీలక మ్యాచ్లో వాడుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంబీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యోచిస్తున్నారట.
నంబర్ 3లో ఆడుతున్న తిలక్ వర్మ ప్రాక్టీస్ సెషన్ అంతంత మాత్రంగానే సాగినట్లు తెలుస్తోంది. అతని నెట్ సెషన్ గురించి సరైన స్పష్టత లేకపోవడంతో.. తిలక్ స్థానంలోనే సంజూను తీసుకునే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు సమాచారం. తిలక్ స్ట్రైక్ రేట్, ప్రస్తుత ఫామ్ను దృష్టిలో ఉంచుకుని టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వరుసగా మూడు డకౌట్లతో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా నెట్స్లో బ్యాటింగ్ చేశాడు. అతను మరోసారి ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఒకవేళ అభిషేక్ లయ అందుకుంటే.. టీమిండియాకు అది పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
బౌలింగ్లో కూడా రెండు అనూహ్య మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఆడించాలని మేనేజ్మెంట్ చూస్తోందట. బ్యాటింగ్, బౌలింగ్ చేయడం అతడికి కలిసొచ్చే అంశం. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ అర్ష్దీప్ సింగ్ జట్టులోకి రానున్నాడు. పిచ్ కండిషన్స్ దృష్ట్యా అర్ష్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట. స్పెసలిస్ట్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పెసలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలు పక్కాగా జట్టులో ఉంటారు. ఈ మూడు మార్పులు నిజమో కాదో తెలియాలంటే?.. టాస్ పడే వరకు వెయిట్ చేయాల్సిందే.