Kailasakona Gruhalayam Temple : పరమశివుడు ధ్యానం చేసిన పర్వతం ఇదే

Update: 2020-08-26 05:35 GMT

Kailasakona Gruhalayam Temple : భారత దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర వుంది. అలాగే ఈ కైలాసకోన గుహాలయానికి కూడా ఒక చరిత్ర వుంది. అంతే కాదు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో అందరినీ ఆకట్టుకునే జలపాతాలు కూడా వున్నాయి. భక్తులందరూ దర్శించుకోదగ్గ ఈ గుహాలయం చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో వుంది.

విశేషాలు

చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం. ఇది కైలాసకోన కొండపై ఉంది. పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం మహా శోభాయమానంగా ఉంటుంది. కైలాస కోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి. గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది. పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించడం కంటే ముందు కొండ గుహలనే ఆలయాలుగా మలచేవారు. ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటాయి.

క్షేత్ర మహాత్యం

నారాయణపురంలో పద్మావతీ వేంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట. పార్వతీపరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది.

పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను, మధుర భావనను కలిగిస్తుంది. అలాంటిది చక్కటి గుహాలయం, ఆ పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం చూడముచ్చటగా ఉంటాయి. ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అలజడులు, ఆందోళనలు మటుమాయమై ఊరట లభిస్తుంది.

పర్యాటక ప్రదేశం

జిల్లాలోని కైలాసకోనకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.ఎంతో అందమైన జలపాతాలలతో ముఖ్యమైనవి తలకోన. కైలాస కోన. ఉబ్బుల మడుగు జలపాతాలు.కైలాస కోన జలపాతం నారాయణవనం మండలంలో ఉంది.ఇక్కడ సిద్ధేశ్వర కామాక్షి మాత దేవాలయం ఉంది. ఇంత అందమైన ప్రదేశానికి కుటుంబాలతో ఇక్కడకు వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు.

కైలాసనాథ కొండ

కైలాసనాథ కొండ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం జలపాతానికి ప్రసిద్ధి. ఇది తిరుపతి నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోను, చిత్తూరు జిల్లా పుత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరం లోనూ ఉంది. చిత్తూరు నుండి చెన్నై వెళ్ళే దారిలో నాగలాపురం అవతల బస్సు దిగి రెండు కి.మీ. వెళితే అద్భుతమైన కైలాసనాధ కోన జలపాతం వస్తుంది. ఆగస్టు, ఫిబ్రవరి మధ్య కాలం ఈ ప్రదేశం సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ వారి వసతి గృహం ఉంది. ఈ జలపాతపు నీటిలో వ్యాధినిర్మూలన శక్తి ఉందని ప్రతీతి.

కైలాస కోన జలపాతం

కైలాస కోన జలపాతం నారాయణవనం మండలంలో ఉంది. ఇది ఎత్తైన కొండలపై నుంచి అనేక ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ 100 అడుగుల పైనుంచి పడుతూ ఉంటుంది.ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నది ప్రజల విశ్వాసం.ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది.

Tags:    

Similar News