Antarvedi Lakshmi Narasimha Swamy: రక్తావలోచనుడు అనే రాక్షసుడు తపస్సు చేసిన ఒడ్డు ఏదో తెలుసా?

Antarvedi Lakshmi Narasimha Swamy: తూర్పు గోదావరి జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది కూడా ఒకటి.

Update: 2020-07-20 05:30 GMT
Antarvedi Sri Lakshmi Narasimha Swamy

Antarvedi Lakshmi Narasimha Swamy: తూర్పు గోదావరి జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది కూడా ఒకటి. ఈ క్షేత్రంలో మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఈ క్షేత్రంలోని ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ ఆలయంలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు. ఈ పుణ్యతీర్థంలో స్వామి వారు భక్తుల కోర్కెలు తీరుస్తారనే ప్రస్ధానం పురాణాలలో కూడా ఉంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ ఉంటుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు.

స్థలపురాణం..

కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

క్షేత్ర నామం...

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.

రక్తవలోచనుని కథ...

ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. 

నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

ఆలయ నిర్మాణ విశేషాలు..

మొదటి ఆలయము శిథిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్ణమ్మ. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త శ్రీ కొపనాతి ఆదినారాయణ గారు వీరి తండ్రిగారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు, కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా విగ్రహము ఉంది. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా (నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయమునకు దూరముగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .

వశిష్టాశ్రమం...

అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము ఉంది. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడింది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరము మధ్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు ఉన్నాయి.

దీప స్తంభం...

దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా దీప స్తంభం (లైట్ హౌస్) ఉంది. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విద్యార్థులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి ఉంది. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, వశిష్టాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతము వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.

అశ్వరూడాంభిక(గుర్రాలక్క) ఆలయం...

నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో ఉంది. స్థల పురాణ రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

అన్న చెళ్ళెళ్ళ గట్టు...

సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం...

వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు...

లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామంలోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి.

Tags:    

Similar News