T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియంలో ‘డ్రింక్’ స్కామ్: తాగేసిన కూల్ డ్రింక్స్‌ మళ్ళీ బాటిళ్లలోకి.. టీ20 వరల్డ్ కప్ వేళ షాకింగ్ వీడియో!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్సాహం మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒక దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Update: 2026-02-12 10:19 GMT

T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్సాహం మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒక దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్టేడియంలోని ఫుడ్ స్టాల్స్ వద్ద సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 10న ఈ స్టేడియంలో నెదర్లాండ్స్ మరియు నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత, గ్యాలరీల్లోని ప్రేక్షకులు తాగి వదిలేసిన 'థమ్స్ అప్' కప్పులను సేకరించిన కొంతమంది కేటరింగ్ సిబ్బంది.. ఆ మిగిలిపోయిన డ్రింక్‌ను మళ్ళీ చిన్న ప్లాస్టిక్ బాటిళ్లలో నింపుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రీ-ప్యాక్ చేసిన బాటిళ్లను తదుపరి మ్యాచ్‌ల్లో కొత్త వాటిలాగా విక్రయించేందుకు వీరు ఈ కుట్రకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నేడు (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు ఇదే స్టేడియంలో భారత్-నమీబియా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ లోపే ఈ వీడియో బయటకు రావడంతో స్టేడియం నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఇది తీవ్రమైన ఆరోగ్య నేరం. వేలాది మంది వచ్చే స్టేడియంలో ఇలాంటి అపరిశుభ్ర పనులు చేస్తే ఇన్ఫెక్షన్లు ప్రబలే అవకాశం ఉంది" అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) మరియు ఐసీసీ తక్షణమే స్పందించి సదరు వెండర్ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, గ్రూప్ దశలో భారత్ తన రెండో మ్యాచ్‌ను నేడు నమీబియాతో ఆడనుంది. గతంలో వన్డే మరియు టీ20 వరల్డ్ కప్‌లలో నమీబియాపై భారత్‌కే పైచేయి ఉంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా కొలంబోకు పయనం కానుంది, అక్కడ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.


Tags:    

Similar News