Viral News: రూ. 50 కోట్ల కుక్క అన్నాడు, హల్చల్ చేశాడు.. చివరికి అసలు విషయం బయటపడింది..!
Viral News: సోషల్ మీడియాలో ఒక్క రాత్రిలో సెలబ్రిటీ అయిపోతున్న రోజులివీ. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బిల్డప్ కొడుతున్నారు.
Viral News: రూ. 50 కోట్ల కుక్క అన్నాడు, హల్చల్ చేశాడు.. చివరికి అసలు విషయం బయటపడింది..!
Viral News: సోషల్ మీడియాలో ఒక్క రాత్రిలో సెలబ్రిటీ అయిపోతున్న రోజులివీ. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బిల్డప్ కొడుతున్నారు. వినే వాడు పిచ్చోడు అయితే చెప్పే వాడు వేదాంతి అన్నట్లు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ అలియాస్ డాగ్ సతీష్.
ఇటీవల ఒక అసాధారణ ప్రకటనతో దేశవ్యాప్తంగా చర్చకు తెర తీశాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తోడేలు జాతికి చెందిన కుక్కను రూ.50 కోట్లకు కొనుగోలు చేశానని అతను ప్రకటించాడు. అమెరికా నుంచి ‘కాడబోమ్స్ ఒకామి’ అనే అరుదైన జాతిని తెప్పించానని చెప్పి సోషల్ మీడియా వేదికగా హంగామా చేశాడు. అయితే ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రంగంలోకి దిగారు.
సతీష్కు వ్యతిరేకంగా హవాలా, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఇప్పటికే ఫిర్యాదులు నమోదవ్వగా, వాటికి సంబంధించి ఈడీ విచారణ ప్రారంభించింది. బెంగళూరులోని జేపీ నగర్లో ఉన్న సతీష్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు షాకింగ్ విషయాలను వెలికి తీశారు. సతీష్ ప్రకటించిన రూ.50 కోట్ల ఖరీదైన కుక్క కొనుగోలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టమైంది. అతని వద్ద అలాంటి రసీదు, డాక్యుమెంట్లు ఏవీ లేకపోవడమే కాకుండా, ఆ కుక్క తన స్నేహితుడి దగ్గర ఉందని చెప్పడమే విచిత్రంగా మారింది.
ఈడీ దర్యాప్తు ప్రకారం, సతీష్ వద్ద అంత విలువైన కుక్క కొనగలిగే ఆర్థిక స్థితి లేదని తేలింది. అతని ఆదాయం, ఖర్చుల వివరాలను పరిశీలించిన అధికారులు ఇది కేవలం వ్యక్తిగత ప్రచారంకోసం చేసిన డ్రామా అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో గుర్తింపు పొందాలనే లక్ష్యంతో అసత్య ప్రకటనలు చేశాడని అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మరింత లోతుగా విచారణ నిర్వహిస్తున్నారు.