దేశంలో కరోనా వైరస్ సంక్షోభాన్ని కట్టడిచేయడం కోసం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మరియు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్లతో కలిసి కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం రూ. 1,125 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
విప్రో లిమిటెడ్ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25 కోట్లు, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. విప్రో వార్షిక..కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధి నుంచి కాకుండా అదనంగా ఈ సాయాన్ని ప్రకటించామని, అలాగే ఫౌండేషన్ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్జీ తన సంపాదనలో చాలా వరకు దాతృత్వ కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తున్నారు.