కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
-రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ -దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సమావేశాలు -పార్లమెంట్లో పెండింగ్లో 43 బిల్లులు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండో దఫా సమావేశాలివి. అయితే దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కేంద్రం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతో పాటు పౌరసత్వ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 13వ తేదీతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంట్లో 43 బిల్లులు పెండింగ్లో ఉండగా... ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి... ఆమోదం పొందించేందుకు సిద్ధమవుతోంది.
మరోపక్క పెద్దల సభలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవనుంది. ఇవాళ రాజ్యసభ 250వ సమావేశం ప్రారంభంకానుంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. 1952 మే 13న ఎగువసభ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో చరిత్రాత్మక ఘట్టాలను వివరిస్తూ రాజ్యసభ-1952 నుండి ప్రయాణం పేరిట ప్రచురించిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు విడుదల చేశారు.