నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

Vice President Election: ఓటింగ్ లో పాల్గొననున్న పార్లమెంట్ ఉభయసభల సభ్యులు

Update: 2022-08-06 02:12 GMT

నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

Vice President Election:  భారత ఉపరాష్ట్రపతి పదవికి ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఈ పోలింగ్ లో పాల్గొననున్నారు. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని 63వ నెంబర్ గదిలో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరరకు పోలింగ్ కొనసాగనున్నది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు 999 మంది ఎంపీలకు గాను 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్ధిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా మార్గరెట్ అల్వా పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగదీప్ ధన్‌ఖడ్ రాజస్థాన్ కు చెందిన జాట్ నాయకుడు. ఇతని వయస్సు 71 ఏళ్లు. ఇక విపక్షాల తరపున పోటీ చేస్తున్న మార్గరెట్ అల్వా రాజస్థాన్, ఉత్తరాఖండ్ గవర్నర్ గా పని చేశారు.

ఎన్డీఏ అభ్యర్ధికి జనతాదళ్(యు), వైసీపీ, టీడీపీ, బీఎస్పీ, ఎఐఎడిఎంకే, శివసేనతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. విపక్షాల అభ్యర్ధి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చ, మజ్లిస్ మద్దతు ప్రకటించగా తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. తృణమూలు కాంగ్రెస్ తరపున లోక్ సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్‌డీయే అభ్యర్థి ధన్‌ఖఢ్‌కు 515కు పైగా ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతిగా విజయం సాధించేందుకు అవి సరిపోతాయని, అల్వాకు 200 ఓట్లకు అటూఇటూగా రావొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రహస్య పద్దతిలో ఓటింగ్ జరగనున్నది.

Tags:    

Similar News