దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం కలకలం రేపుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్ దిలీప్ అదృశ్యమయ్యారు. హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ శ్రీధర్ ఢిల్లీ ఎయిమ్స్లో పని చేస్తున్నాడు. అయితే హిమబిందు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంది. చండీగఢ్లో పిల్లల వైద్యుడిగా డాక్టర్ దిలీప్ పని చేస్తున్నాడు.
వీరంతా కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. హిమబిందు భర్తకు ఫోన్ చేసి తాను దిలీప్తో కలిసి చర్చికి వెళ్తున్నామని చెప్పింది. కాసేపట్లోనే ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఎంతవెతికినా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు.