మళ్ళీ విజృంభిస్తున్న ఏలూరు వింత వ్యాధి

Update: 2021-01-22 15:13 GMT

ప్రతీకాత్మక చిత్రం 

సమసిపోయిందనుకున్న ఏలూరు వింత వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కల్లోలం కొనసాగుతుండగానే ఉన్నట్టుండి ప్రజలు కుప్పకూలిన ఘటన వైద్య నిపుణులనే ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. కొన్నాళ్లు గాప్ ఇచ్చిన ఈ వింత వ్యాధి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. చూస్తుండగానే ప్రజలు కళ్లు తిరిగి పడిపోతున్నారు. అసలు ఏలూరులో ఏం జరుగుతోంది..?

నడుస్తున్న వారు నడుస్తున్నట్టే.. కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే కింద పడుతున్నారు. ఒకటి, రెండూ కాదు బాధిత గ్రామాలు ఏకంగా మూడుకు చేరుకున్నాయి. బాధితుల్లో ఎక్కువగా శ్వాస తీసుకోవడం, తల తిరగడం, కళ్లు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో ఎక్కవగా మహిళలు, చిన్నారులే ఉండటం ఆందోళన కల్గిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఆస్పత్రుల్లో బెడ్స్ సంఖ్యను పెంచారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు మాత్రం అసలు ఏలూరు ఏం జరుగుతోందో కనిపెట్టలేకపోతున్నారు.

మూడురోజుల క్రితం భీమడోలు మండల పూళ్లగ్రామంలో ఏలూరు తరహాలో వింత వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు లోనయ్యారు. 16 మందికిపైగా అనారోగ్యం పాలవగా, వారిలో కొందరికి మూర్ఛ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. ఇక ఈ తరహా లక్షణాలతో అస్వస్థతకు గురి కావడం ఇటీవల తరచుగా జరుగుతోంది.

అటు.. కొమిరేపల్లిలోనూ ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని ప్రజలు వింత వ్యాధి లక్షణాలతో ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఇప్పటికే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొమిరేపల్లికి బయల్దేరారు. 

Tags:    

Similar News