బాలుడిగా కరోడ్ పతి గెలిచాడు.. పోలీసు అధికారిగా తన కలల్ని జయించాడు!
ఎదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.
ఎదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరమే రాదు. సరిగ్గా అలాంటిదే ఇది. పద్నాలుగేళ్ళ బాలుడు తన అసాధారణ ప్రతిభతో కోటి రూపాయలు గెల్చుకున్నాడు. కాలం కరిగిపోయింది. రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు అదే బాలుడు..యువకుడై ఐపీఎస్ అధికారిగా ఎదిగాడు. ఈ అద్భుతం మామూలుగా మనం చెప్పుకున్నంత సులువుగా ఏమీ జరిగిపోలేదు. ఆ యువకుని ప్రతి అడుగులోనూ ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. అవే ఈరోజు తను కోరుకున్న విధంగా పోలీసు అధికారిని చేశాయి. వివరాల్లోకి వెళితే..
చదువుతో పాటు అదృష్టం కలిసొస్తే అనుకొన్నది సాధ్యమవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిరూపించాడు రాజస్థాన్కు చెందిన రవిమోహన్ సైనీ. చిన్నతనం నుంచే విద్యాపాటవాలు ప్రదర్శించి ఓ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
రాజస్థాన్కు చెందిన రవిమోహన్ సైనీ చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణిస్తున్నాడు. 2001లో ప్రసారమైన 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్ సైనికి అప్పుడు 14 ఏండ్లు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కేబీసీ జూనియర్లో పాల్గొని 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కరోడ్పతిగా నిలిచాడు. అనంతరం జైపూర్లో ఉన్నతవిద్య పూర్తిచేసి అక్కడే ఎంబీబీఎస్ కూడా పూర్తి చేశాడు. నేవీలో పనిచేస్తున్న తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో 2014 లో సివిల్స్ రాసి 461 ర్యాంకు సాధించిన రవిమోహన్ సైని.. హైదరాబాద్లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకొన్నారు.
తాను పోలీసు అధికారి కావడంలో తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఉందని ఈ యువ అధికారి చెబుతున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ను విజయవంతంగా అమలుచేయడంలో దృష్టిసారించామని, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని సైనీ చెప్పారు. 14 ఏండ్ల ప్రాయంలో అమితాబ్ బచ్చన్తో కలువడం, కోటి రూపాయలు గెలువడం జీవితంలో మరిచిపోలేని అనుభూతులని ప్రస్తుతం 33 ఏళ్ల వాడైన సైనీ మంగళవారం పోర్బందర్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరిస్తూ అప్పటి విషయాలను మీడియాతో పంచుకున్నారు.
హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి