జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. మరో ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్నీ ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు, హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ కమాండర్ రియాజ్ ను పట్టుకోవడానికి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలోని షర్సాలీ గ్రామంలో ఉగ్రవాది తారసపడంతో కాల్చి చంపామని.. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి..ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన సీనియర్ కమాండర్గా పేరొందిన హిజ్బుల్ యొక్క ఆపరేషన్ చీఫ్ రియాజ్ ఆచూకీ లభ్యమైంది. దాంతో భారత భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. అతనికోసం బీగ్పోరా గుల్జాపోరాలో ప్రస్తుతం శోధన కార్యకలాపాలు జరుగుతున్నాయి. అతన్ని గుర్తించడానికి ఆపరేషన్ ప్రారంభించినట్లు వర్గాలు తెలిపాయి. పుల్వామాలో రెండు ఆపరేషన్లు జరుగుతున్నాయని ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. ప్రస్తుతం, బలగాలు ఇంటింటిని శోధిస్తున్నట్లు తెలిపారు.