లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈరోజు ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నిప్పు.. ఉప్పు లా ఉండే ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు. అంతేనా చాలాసేపు చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరపడం ఆకర్షించింది. తొలుత సీఎం రమేశ్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చినా ఆయన వారిద్దరికీ కొంత దూరంలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత కూడా సీఎం రమేశ్, విజయసాయిరెడ్డిలు చర్చల్లో మునిగిపోయారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని విలేకర్లు అడగగా ''మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేశ్ను అడిగాను'' అని బదులిచ్చారు.