దిశ హత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపధ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై స్వాతి మాలివాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిరహారదీక్షకు దిగనున్నట్లు వెల్లడించారు.
అత్యాచార నిందితులకు 6 నెలలలోగా మరణ శిక్ష విధించాలని స్వాతి మలేవాల్ డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 10 గంటలనుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్లుగా ప్రకటించారు. కేంద్రం నుంచి హామీ లభించేంత వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. మైనర్లపై అత్యాచారం చేసిన వారిని వెంటనే మరణ శిక్ష విధించాలని స్వాతి మాలివాల్ గత ఏడాది ఏప్రిల్లో నిరాహార దీక్ష చేశారు. 12 సంవత్సరాల బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్షతోపాటు, కఠిన శిక్షలకు కేంద్రం ఆర్డినెన్స్ను తెచ్చిన సంగతి తెలిసిందే.