శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పిటిషన్ విచారించనున్న సుప్రీం కోర్టు
రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటల్లోపు విశ్వాసం నిరూపించుకొనేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది.
రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని 24 గంటల్లోపు విశ్వాసం నిరూపించుకొనేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడం అనైతికమని ఆరోపిస్తూ.. సుప్రీం కోర్టులో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేశాయి.
పిటిషన్లో ప్రధానంగా మూడు అంశాలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు కోరారు. మెజార్టీ లేని ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేశాయి. కూటమి నేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా.. 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలి అని కోర్టుకు విన్నవించారు.
ఫడ్నవీస్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఆహ్వానించడాన్ని పిటిషన్లో శివసేన తప్పుబట్టింది. బలపరీక్ష ఇవాళే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరింది. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించనున్నారు. పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరించడంతో మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరగనుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బల నిరూపణకు గవర్నర్ బీజేపీకి వారం రోజులు గడువు ఇచ్చారు. అయితే.. శివసేన కోరినట్టు సుప్రీం కోర్టు, ఇవాళే.. బల పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే.. మహా రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నర్ విచక్షణ అధికారాలకు లోబడే వ్యవహరించారని బీజేపీ చెప్పుకొస్తున్న తరుణంలో.. సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.