మతమార్పిడి చట్టాలపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

చెల్లుబాటు అంశంపై పరిశీలిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం

Update: 2021-01-06 16:25 GMT

 పెళ్లి తర్వాత బలవంతపు మతమార్పిడిని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఐతే ఈ చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్ అనే ఎన్జీవో పిటిషన్లు దాఖలు చేసింది.

 ఈ చట్టాల్లోని నిబంధనలు దౌర్జన్యంగా ఉన్నాయని... ప్రభుత్వం అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనడం విచారకరమని పిటిషనర్లు అందులో తెలిపారు. చట్టాల చెల్లుబాటును సుప్రీం సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పటివరకు చట్టాల అమలుపై స్టే విధించాలని కోరారు.పిటిషన్లను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వీటిపై నాలుగు వారాల్లోగా ఆన్సర్ ఇవ్వాలని ఆదేశించింది. ఐతే ప్రభుత్వాల వాదన వినకుండా చట్టాలపై స్టే ఇవ్వడం కుదరదని సీజేఐ జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు.


Tags:    

Similar News