ఇప్పటికే పేస్ బుక్ అకౌంట్ల డేటా లీక్ వార్తలు వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తుంటే...తాజాగా భారతీయ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతా దారుల గుండెల్లో రైలు పరుగెత్తించే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. డేటా భద్రతకు సంబంధించి టెక్ క్రంచ్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకింగ్ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే సదుపాయమే 'ఎస్బీఐ క్విక్'. ముంబైలోని ఎస్బీఐ క్విక్ సర్వర్ డేటా సెంటర్కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదని, తద్వారా హ్యాకర్లు చాలా సులువుగా లక్షలాదిమంది కస్టమర్ల డేటాను యాక్సెస్ చేయొచ్చని టెక్ క్రంచ్ పేర్కొంది.
దీంతో ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళుతోందన్న అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పటికే లక్షలాది కస్టమర్ల బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు, ఫోన్ నెంబర్లు తదితర వివరాలు లీకయినట్టు పేర్కొంది. దీంతో ఎస్బీఐ కస్టమర్లలో ఆందోళన మొదలయింది. అకౌంట్లో నగదు ట్రాన్సాక్షన్, చివరి ఐదు లావాదేవీలు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, లోన్ లకు సంబంధించిన సమాచారం ఈ ఎస్బీఐ క్విక్ ద్వారా పొందుతున్నారు. అయితే పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేని ఈ డేటా సెంటర్ వలన కస్టమర్ల సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా తెలుసుకోవచ్చని అంటోంది. అయితే దీనిపై ఎస్బీఐ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. అత్యున్నత విలువలతో సేవలందిస్తున్న ఎస్బీఐ వినియోగదారుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉందని.. అలాగే డేటాలీక్పై మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్బీఐ ట్విట్టర్లో తెలిపింది.