Chardham Yatra 2024: తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం
Chardham Yatra 2024: హిమగిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది.
Chardham Yatra 2024: హిమగిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. పూజలు, వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ తలుపులను తెరిచారు అర్చకులు. ఈ సందర్భంగా చేసిన ప్రత్యేక పూజల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆలయం తెరిచే సందర్భంగా భారత ఆర్మీ ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రత్యేక పూజల సందర్భంగా హెలికాప్టర్ ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.
ఇక ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర.. ఆరు నెలల పాటు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయ శ్రేణుల్లో ఉండే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. దీపావళి మర్నాడు కార్తీకమాసం రోజున మూసివేసే ఈ నాలుగు ఆలయాలను.. అక్షయ తృతీయ రోజున తెరుస్తారు. శీతాకాలంలో మంచు కారణంగా మూసి ఉండే ఈ ఆలయాలను దర్శించుకోడానికి భక్తులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల తర్వాత అశేష భక్తుల సందర్శనార్ధం కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి శుక్రవారం తెరుచుకున్నాయి.