బ్యాంకుల సేవింగ్ ఖాతాల్లో మినిమం బాలెన్స్ మైంటైన్ చెయ్యకపోతే కస్టమర్లను ఛార్జీలతో బాదేయడం చూస్తుంటాం.. అయితే ఏటీఎంలో సరిపడినంత నగదు ఉంచడంలో ఫెయిలైన ఎస్బీఐకి ఝలక్ ఇచ్చింది వినియోగదారుల ఫోరమ్.. వివరాల్లోకి వెళితే రాయపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏటీఎంలో నగదు విత్ డ్రా కోసం వెళ్లినపుడు ఏటీఎంలో నో క్యాష్ అంటూ వచ్చింది.
మూడుసార్లు అలా రావడంతో అతని కోపం నషాళానికి అంటింది. దాంతో సదరు కస్టమరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2017 ఏడాదిలో మే, జూన్ నెలలో ఇలా మూడుసార్లు ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి ఫిర్యాదును పరిశీలించిన అనంతరం నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. ఏటీఎంలలో నగదు మైంటైన్ చేయనందుకు ఎస్బీఐకి రూ.2500 ఫైన్ వేసింది.